నడక దారిలో-43

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ:-
       ( తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నాచదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం.స్వాతిపత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. మా జీవన గీతానికి పల్లవి చేరింది.మరుదులవివాహాలతో కుటుంబం పెద్దదైంది.నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది.ఉమ్మడి కుటుంబం విడిపోవటం అయ్యాయి. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం,మా బాబు అనారోగ్యం,ఎమ్మే తెలుగు పరీక్షల తర్వాత బాబు చనిపోయాడు. ఆంధ్రమహిళాసభ బియ్యీడీ కాలేజి లో చేరి హార్డిల్ రేసులా ఒడిదుడుకులతో బియ్యీడీ పుర్తిచేసి, రెండు స్కూల్స్ లో తాత్కాలికంగా పనిచేసి,ఎట్టకేలకు ఆర్టీసి హైస్కూల్ లో చేరాను.తెలుగుదేశం ప్రభుత్వంలో వీర్రాజుగారు బిజీ తట్టుకోలేక స్వచ్ఛందవిరమణ చేసారు.కొంత అనారోగ్యం పాలు అయ్యారు.విజయవంతంగా నా ఎమ్మెస్సీ పూర్తిచేసాను.అమ్మ చనిపోవటం తర్వాత ఏడాది తేడాలో చిన్నక్క పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు జరిగాయి.తర్వాత—)

***

          ఒకరోజు చిన్నన్నయ్య ఫోన్ చేసి ఒక సంబంధం గురించి చెప్పాడు. పెద్దనాన్న మనవడు ప్రకాశరావు, మా అన్నయ్యకి చిన్నప్పటి నుండి స్నేహితులు. ప్రకాశరావు  వాళ్ళకి బంధువులట, మా నాన్నగారి వూరు ధర్మవరానికి చెందినవారు. అయితే ఉద్యోగరీత్యా భిలైలో ఉంటూ ఇప్పుడు విజయనగరం వచ్చి స్థిరపడ్డారు. వాళ్ళ రెండో అబ్బాయి. రూర్ఖెలాస్టీల్ ఫాక్టరీలో పనిచేస్తున్నాడని చెప్పేడు.
 
          అన్నయ్యకి తెలిసినవాళ్ళు కదా పరవాలేదనుకున్నాము. పల్లవి ఫొటో, జాతకం పంపమని, ఆ అబ్బాయిఫొటో కూడా పంపారు. ఫొటో చూసి మేము కొంచెం అసంతృప్తి చెందాము. కానీ మా మరిది చూసి “అందరికీ ఏవో వంకలు చెప్తుంటే ఎలా? బాగానే ఉన్నాడు. మంచి వుద్యోగం” అనేసరికి ‘నిజమేలే, ఇండియాలోనే ఉంటారు’ అనుకున్నాము.
 
          అబ్బాయి మేనత్త హైదరాబాద్ లోనే ఉంటుందట. ఒకరోజు సాయంత్రం వస్తున్నానని ఫోన్ చేసి ఆ అబ్బాయి వచ్చేసాడు. మేము కాసేపు మాట్లాడి కాఫీ తీసుకు రావటానికనే వంకతో లోపలికి వచ్చాము. పల్లవితో కాసేపు మాట్లాడాడు. తర్వాత అతను ‘యూఎస్ రావటానికి ఇష్టమేనా’ అని అడిగాడట. పల్లవి తనకి ఇష్టం లేదందిట. “ఒక్కతే అమ్మాయివనా? అక్కడ కొన్నాళ్ళు వుండి తిరిగి వచ్చేద్దాం. ప్రస్థుతం నేను వుద్యోగం మానేసాను. యూఎస్ వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నాను ” అన్నాడని చెప్పింది. మళ్ళా మేము ఆలోచనలో పడ్డాం. పల్లవిని ” నీకు ఇష్టమేనా ” అని అడుగుతే మీ ఇద్దరికి నచ్చుతే నాకేమీ అభ్యంతరం లేదు అంది మరీ పాతకాలపు అమ్మాయిలా.
 
          కానీ వీర్రాజు గారికి కొంత అసంతృప్తిగానే వుంది. కానీ రోజూ ఏ విషయమూ చెప్పమని అబ్బాయి మేనమామ నుండి ఫోన్లు. వీర్రాజు గారు ఏదో ఒకటి చెప్పాలన్నట్లుగా ” మాకు కట్నాలు అవీ ఇవ్వటం ఇష్టం లేదు. ఆ విషయం వాళ్ళకి చెప్పండి” అన్నారు. మరో రెండురోజులకు “కట్నకానుకల ఆశ లేదనీ, అమ్మాయికి బంగారంకూడా మీ ఇష్టమే. మాకేమీ అభ్యంతరాలు లేవని ” అబ్బాయి తండ్రి నుండి పెద్ద ఉత్తరం వచ్చింది.
 
          మళ్ళీ వాళ్ళ నుండి ఫోను వస్తే ” మేము  సింపుల్ గా సభావివాహం చేసుకున్నాము. మాది కమ్యూనిస్టు ఐడియాలజీ” అన్నారు. దీనికి మాత్రం వాళ్ళు అభ్యంతరం చెప్పారు. “మా పెద్దబ్బాయి వర్ణాంతర వివాహం చేసుకున్నాడు. వాళ్ళు సింగపూర్ లో ఉన్నారు. చిన్నబ్బాయికి సాంప్రదాయంగా చెయ్యాలని మా కోరిక. దీనికి అంగీకరించమని ” అన్నారు. ఆలోచించి చెప్తానని వీర్రాజుగారు అని పెట్టేసారు.
 
          ఓ వారం పదిరోజులపాటు ఇంకేమీ మాటలు లేవు. అయితే మా చిన్నన్నయ్య ఫోన్ చేసి ” వాళ్ళు పల్లవిని చూస్తామంటున్నారు. ఒక రెండు రోజులకి విజయనగరం రండి. ముఖాముఖీ మాట్లాడితే ఏదో ఒకటి నిర్ణయానికి రావచ్చు” అన్నాడు.
 
          సరేనని విజయనగరానికి ప్రయాణం కట్టాము. మా పెద్దక్కనీ,పెద్దన్నయ్యనీ కూడా పిలిచాము. అబ్బాయి రాలేదు కానీ అతని తండ్రి తాలూకు అన్నదమ్ములంతా భార్యలతో వచ్చేసారు. ఆడవాళ్ళం అందరం లోపల గదిలోనూ, ముందు గదిలో మగవాళ్ళంతా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వీర్రాజుగారు అసలే ఖచ్చితంగా మాట్లాడలేరు. ఏం మాట్లాడుతారో అని నాకు ఒకవైపు భయంగా అనిపించింది. వాళ్ళవాళ్ళంతా పెళ్ళి నిశ్చయం అయిపోయినట్లే మాట్లాడుతున్నారు. కాసేపటికి నన్ను పిలిచారు. అబ్బాయి వచ్చేనెలలో యూఎస్ వెళ్ళిపోవాలనీ, పదిరోజుల్లో ఉన్న ముహూర్తానికి పెళ్ళి అని చెప్పారు. ఇంత ఆఘమేఘాల మీద అంటే ఎలా  చేస్తాము. నాకు అయోమయంగా అయింది.
 
          వాళ్ళంతా వెళ్ళాక నేను ఎస్టీడి బూత్ కి వెళ్ళి కింద యింట్లో వుండే యజ్ణప్రభ గారికి ఫోన్ చేసి విషయం చెప్పాను. తన సంగీతం విద్యార్థి అనే కాక ఆవిడకి పల్లవి అంటే చాలా ప్రేమ. ఆమె చాలా సంబరపడి తాను సహాయసహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు.
 
          తిరిగి హైదరాబాద్ రాగానే ఇంటికి కలర్స్ వేయటంతో మొదలుపెట్టి పెళ్ళిపనులు ప్రారంభించాము.
 
          యజ్ణప్రభగారు తన ఇంట్లో పెళ్ళిలాగే మూడురోజులకు కేటరింగ్ అతనిని మాట్లాడారు. బాలప్రసాద్ మారేజ్ హాలు, అలంకరణ బుక్ చేయటం మొదలైన వాటిలో సహకరించాడు. ఈ విధంగా బంధువులు అందరి సమక్షంలో అనుకున్నకన్నా వైభవంగా పల్లవి పెళ్ళి జరిగింది. అజయ్ తో ” పల్లవి తనకేంకావాలో మనసు విప్పి చెప్పదు. కనిపెట్టి చూసుకో” కళ్ళనీళ్ళతో చెప్పాను.
 
          మూడురోజుల తర్వాత పల్లవీ, అజయ్ విజయనగరం వెళ్ళిపోయారు.
 
          తర్వాత పదిహేను రోజులకే అజయ్ ప్రయాణం ఈ లోగా మేరేజ్ సర్టిఫికెట్ తీసుకోవటం, పాస్ పోర్ట్ కి అప్లై చేయటం చేసారు. అజయ్ తల్లిదండ్రులు, పల్లవీ మేమూ కూడా అజయ్ కి సెండాఫ్ చేయటానికి బొంబాయి వెళ్ళాము.
 
          మళ్ళా వెంటవెంటనే ప్రోసెసింగ్ మొదలై పల్లవికి కూడా వీసా వచ్చేసింది. ఫ్లైట్ టికెట్ కొనటం మొదలైనవన్నీ మా ఇంటి పక్కనే వున్న పల్లవి స్నేహితురాలు సుధావాళ్ళ అన్నకి సీతా ట్రావెల్స్ లో వుద్యోగం కావటం వలన రఘునే  చూసుకున్నాడు. ఆ అబ్బాయి మా యింట్లో పిల్లాడిలా సహకరించాడు.
 
          ఎప్పుడూ వంటరిగా  విజయనగరం కూడా పంపలేదు. ఇప్పడు ఏకంగా సప్త సముద్రాలుదాటి ఖంఢాంతర ప్రయాణానికి సిద్ధం అవుతోంది. హైదరాబాద్ నుండే పల్లవి ఫ్లైట్. రఘూ కూడా అక్కడ పని చేయటం వలన పల్లవితో పాటూ లోపలికి వెళ్ళి చెకిన్ అయ్యే వరకూ ఉండి వచ్చాడు.
 
          సెండాఫ్ ఇవ్వటానికి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాము. ఇప్పటిలా ఆ రోజుల్లో సెక్యూరిటీ ఎక్కువగా ఉండేది కాదు. అందుచేత లాంజ్ వరకూ వెళ్ళాము.
 
          పల్లవి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఒంటరినై పోయినట్లు అయ్యింది. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళటం మనసులో మాటలు ఒకరికొకరం చెప్పుకోవటం స్నేహితుల్లా వుండేవాళ్ళం.
 
          పల్లవి యూఎస్ చేరిన తర్వాత తన ప్రయాణం అనుభవాన్ని సుదీర్ఘంగా ఉత్తరం రాసింది. ఉత్తరాలు రాసినా అవి ఖండాంతరాలు దాటి గమ్యం చేరుకోవటానికి చాలా రోజులు పట్టేది. అప్పటికి సెల్ ఫోన్లు లేవు ఐ.ఎస్.డీ సౌకర్యం వుంటేనే మాట్లాడు కోవాలి. అందుచేత పల్లవి వాళ్ళు ఫోన్ చేసే వరకూ ఆగాల్సిందే. లేదా ఎస్టీడీ బూత్ కో, కంప్యూటర్ సెంటర్ కో వెళ్ళి మాట్లాడాలి. ప్రతీ ఆదివారం ఉదయమే తొందరగా లేచి తయారై ఫోన్ కోసం ఎదురు చూడటం మా ఒక ప్రధాన కార్యక్రమం.
 
          అప్పట్లోనే నేను రాసిన పడమటి గాలి అనే కవిత ప్రచురణ అయ్యింది. ఆ కవిత పెద్ద సంచలనం. అమెరికా వెళ్ళిన పిల్లలున్న చాలా మంది తల్లులు ఆ కవితను జిరాక్స్ చేయించుకున్నామని చెప్పటం నాకు భలే సంతోషం కలిగించింది. ఒక కవిత అంత మందికి అనుసంధానం కావటం కన్నా కవికి కావాల్సిందేమిటి?
 
          నాకు మెనోపాజ్ సమస్యలు రానురాను ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా రక్తస్రావం ప్రతీ నెలా 15-20 రోజులు కావటంతో నీరసం, తరుచు కళ్ళు తిరిగి పడిపోవటం జరుగుతుంది. ఇంటి దగ్గర్లో వున్న ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడుతున్నా తగ్గటం లేదు.
 
          దీనికితోడు పెద్దమరిది తీవ్ర అనారోగ్యం పాలు అయ్యాడు. కొన్నాళ్ళు కామినేనిలో చేర్చారు. కానీ ఫలితం ఏమీలేదు. అన్నిరకాల పరీక్షలూ చేయగా కేన్సర్ అని మూడు నెలల కన్నా జీవించటం కష్టమని తెలిసింది. వీర్రాజు గారు రోజు విడిచి రోజైనా వెళ్ళి చూసి వస్తున్నారు. ఒక్కొక్కప్పుడు స్కూల్ నుండే అలా సీతాఫలమండీ వాళ్ళింటికి వెళ్ళి నేనూ చూసి వస్తున్నాను. ఒకవైపు నా శారీరక ఇబ్బంది, మరోవైపు తమ్ముడి గురించి డీలా పడిపోతున్న వీర్రాజు గారు, స్కూలులో వత్తిడి వీటితో సతమతమై పోతున్నాను. అయితే ఎంత బాధ, దుఃఖం ఉన్నా పుస్తకం పెట్టుకుంటే అన్నీ మర్చిపోయి ప్రశాంతత వస్తుంది. అందుకే ఎంత రాత్రైనా కాసేపైనా చదువుకోవటమో, లేదా బాధనీ, దుఃఖాన్ని అక్షరాల లోకి అనువదించుకోవటమో చిన్నప్పటి నుండి అలవాటైపోయింది.
 
          చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళని చూస్తుంటే అలా డీలా పడి వుంటే నేను ఎన్నిసార్లు చేసుకోవాలో అని అనుకుంటాను.
 
          ఒకరోజు స్కూల్ నుండి వచ్చి స్నానం చేసి కాఫీ తాగుతున్నాను. మా మరిదిపోయిన వార్త ఫోనులో. వెంటనే ఆఘమేఘాల మీద ఇద్దరం వెళ్ళాం. కేన్సర్ పేషెంట్ , అంతేకాక ఒళ్ళంతా అనేక అనారోగ్యాలతో పాడైంది. వెంటనే కార్యక్రమం చేయకుండా మర్నాటికి వాయిదా వేసారు. రాత్రంతా జంగమోళ్ళుకాబోలు వైనాలువైనాలుగా వర్ణిస్తూ ఏడుపు పాటలు, మధ్యలో తాగుడు, ఆ పరిసరాలన్నీ కంపుతోనూ, అపరిశుభ్రతతోనూ నిండి పోయింది. అదిగాక మరిది శరీరం నుండి కలుషరక్తం నవరంధ్రాలు నుండీ వెలువడు తుంది. నేను అక్కడ వుండలేని పరిస్థితి. కానీ తప్పలేదు. మా తోటికోడలు పుట్టింటి వాళ్ళు వచ్చాక అంత్యక్రియలు మొదలయ్యాయి. వీర్రాజుగారే చేసారు. ఆ పదిరోజులూ మొత్తం ఖర్చు అంతా మేమే పెట్టుకున్నాం. దశదిన కార్యక్రమంలో చేసేవి నాకు నచ్చక పోయినా మౌనంవహించక తప్పలేదు.
 
          చిన్నన్నయ్య పెద్దకొడుకు భార్గవ సివిల్స్ కి ప్రిపేర్ కావటానికి వచ్చాడు. క్రితం సారి విజయనగరం వెళ్ళినప్పుడే  “పరీక్షలు కాగానే నీదగ్గరకు భార్గవని పంపించేస్తాను. ఏం చేయాలనుకుంటున్నాడో కొంచెం కనిపెట్టి చూసుకో ” అని అన్నయ్య చెప్పాడు. రోజంతా పుస్తకాలు చదువుతున్నాడు కానీ సివిల్స్ కి పనికొచ్చేవి చదువుతున్నట్లు కనిపించ లేదు. కొన్ని రోజులు దిల్ సుఖ్ నగర్లో ఏదో కోచింగ్ సెంటర్ లో ఫేకల్టీగా జాయిన్ అయ్యానని చెప్పాడు. నేను టిఫిన్, కూరా పప్పు చేసి నా మట్టుకు అన్నం వండుకునే దాన్ని. వీర్రాజు గారు తర్వాత వాళ్ళిద్దరికీ అన్నం వండేవారు. పదింటికి టీ కూడా ఇద్దరికీ చేసేవారు. నేను సాయంత్రం స్కూల్ నుండి వచ్చేసరికి ఒక్కొక్కసారి టీ కప్పులు మంచం దగ్గరో పుస్తకాల షెల్ఫ్ మీద ఈగలువాలుతూ ఎండిపోయి వుండేవి. డైనింగ్ టేబుల్ మీద కూడా ఎక్కడివక్కడే వుండేవి. వీర్రాజగారికి భోజనం అయ్యాక మిగిలినవి ఫ్రిజ్ లో పెట్టేసే వారు. భార్గవకి అలవాటు లేక వదిలేసే వాడు. అలసిపోయి వచ్చిన నాకు చికాకూ, కోపం వచ్చే సేది. ఆ పిల్లాడిని అనలేక ఆయన పైనే వెళ్ళగక్కేదాన్ని.
 
          ” సివిల్స్ కి ప్రిపరేషన్ అన్నాడు కదా వివేకానందుడు, రామకృష్ణ పుస్తకాలు చదువు తున్నాడు. ఒకసారి వాణ్ణి మందలించు ” అన్నారు ఒకసారి.
 
          “అనకుండా ఆయన మంచివాడనిపించుకోవాలి. అని నేను చెడ్డదాన్ననిపించుకో వాలా” అని మనసులో అనుకుని వూరుకున్నాను.
 
          తర్వాత్తర్వాత నాకు మానసికంగా కూడా ఒత్తిడి, కోపం పెరిగి అవి అణచుకోవటంతో రక్తస్రావం ఎక్కువగా వుండేది. ఇక నా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సివచ్చింది. ఇంటికి దగ్గర్లోనే ఉన్న జయా నర్సింగ్ హోంలో చూపించుకున్నాను. చాలా పరీక్షలు చేసి హిస్టరెక్టమీ చేయించుకోవాలన్నారు.
 
          అయితే కనీసం ఒకనెల అయినా బరువులవి ఎత్తకూడదు. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే పెద్దక్క తాను సాయం వస్తానని చెప్పింది. ఆమెతో పాటూ చిన్నక్క, మా చిన్న ఆడపడుచు కూడా వచ్చారు.
 
          మేజర్ ఆపరేషన్ కావటం వలన జనరల్ అనస్థీషియా ఇచ్చారు. ఎందువలనో ఆపరేషన్ తర్వాత సాయంత్రానికి కూడా స్పృహలోకి రాలేదు. అంతేకాక బీపీ పెరిగి పోయింది. దాంతో అనెస్థీషియన్ కంగారు పడి మెలకువ తేవటానికి ప్రయత్నాలు చేయగా చేయగా అప్పటికి మామూలుగా స్పృహలోకి వచ్చాను. వారంరోజులకి డిస్చార్జ్ చేసారు. పెద్దక్క కూతురు శ్రీదేవి కూడా వచ్చి రెండు రోజులు సాయంగా వుంది. నేను ఇంటికి వచ్చాక నాలుగైదు రోజులకి అందరూ వెళ్ళిపోయారు.
 
          సివిల్స్ పరీక్ష అని పేపర్లో చూసాను. కానీ భార్గవ పరీక్ష రాయటానికి వెళ్ళలేదు. ఏవో పుస్తకాలు చదువుతూ కూర్చున్నాడు. నేను భరించలేక పరీక్ష గురించి అడిగాను. విద్యా వ్యవస్థ గురించి కామెంట్ చేసాడు. ఆ ఏడాదే నోబుల్ ప్రైజ్ పొందిన అమార్త్యసేన్ గురించి అతను ఎన్నాళ్ళు ఖాళీగా వుండి తర్వాత నోబల్ స్థాయికి చేరాడో చెప్పాడు.
 
          ” వాళ్ళ సంగతి సరే మీ నాన్న ఏ స్థాయి నుంచి ఎదిగి  ఎంత కష్టపడి మిమ్మల్ని ఇంత మంచి చదువు చెప్పించాడో గుర్తుంచుకో. ముందు మీ నాన్న మీద ఆధారపడ కుండా కొంతకాలం బ్రతకటానికి సరిపడా సంపాదించి, తర్వాత నువ్వు ఏం చేయాలను కున్నావో అది చేసుకో ” కొంచెం సీరియస్ గానే అన్నాను.
 
          ఏమనుకున్నాడో సాయంత్రం తన సామాను తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఇంట్లో ఏం చెప్పాడో తెలియదు. అప్పటి నుండి చిన్నన్నయ్య నుండి ఉత్తరాలు ఆగి పోయాయి. నేను రాసినా సమాధానం లేదు. వీర్రాజుగారు రాసినా సమాధానం లేదు. ఇంక ఊరుకోలేక నేను వివరంగా అన్ని విషయాలూ రాసి ‘ పిల్లల బాగు కోరుకునే టీచర్ని. నాకు పల్లవి ఎంతో వాడూ అంతే. అందుకే పరీక్ష రాయటానికి వచ్చినవాడు పక్కదారి పడుతున్నాడేమోనని మందలించాను. నేను ఎక్కువ చనువు తీసుకుని మందలిం చాననుకుంటే మన్నించు.’ అని వుత్తరం రాసాను. దానికి కూడా సమాధానం లేదు. నాకు మనసు చాలా నొచ్చుకుంది.
 
          వీర్రాజుగారి సాయంతో యథావిధిగా పనులు చేసుకుంటున్నాను.పెట్టిన నెలరోజుల సెలవు పూర్తి చేసుకుని లాస్ట్ వర్కింగ్ రోజు తిరిగి స్కూలుకి వెళ్ళాను. తర్వాత ఎలాగూ వేసవి సెలవులే కనుక నేను రెస్ట్ తీసుకోవచ్చును.
*****
Please follow and like us:

2 thoughts on “నడక దారిలో(భాగం-43)”

  1. పల్లవి పెళ్లి విశేషాలు, తర్వాత అమెరికా వెళ్లిపోవడం, మీ కవిత ‘పడమటి గాలి’కి వచ్చిన స్పందన, పెద్ద మరిది మరణం, అంత్యక్రియలు మీరే చెయ్యడం, సివిల్స్ రాయడానికి భార్గవ మీ ఇంట్లో ఉండటం —- ఈ విశేషాలతో 43వ భాగం ఆసక్తికరంగా సాగింది. ప్రొద్దున్నే ఇంటిపనులు చేసుకుని, స్కూల్లో పని చేసి వచ్చినప్పుడు, కనీసం తాగిన కాఫీ కప్పులు తీయక పోవడం, మిగిలిన పదార్థాలను ఫ్రిజ్లో పెట్టకపోవడం చూసి అసహనం కలగడం సహజం! భార్గవ్ కు సరైన సలహా ఇచ్చినా అపార్ధానికి దారితీయడం గురించి బాగా రాసారు.

    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు శాంతిశ్రీ

Leave a Reply

Your email address will not be published.