కాదేదీ కథకనర్హం-7

హారతి పళ్ళెం

-డి.కామేశ్వరి 

          రెండు రోజుల ముసురు తరువాత ఊర్లో సూర్యడుదయించాడు. తెల్లారి సూర్యుడ్ని చూడగానే జనం సంతోషించారు. సంతోషించని దేవరన్నా వుంటే పూజారి మాధవయ్య ఒక్కడే. తెల్లారకుండా వుంటే ! సూర్యు డుదయించకుండా వుంటే! ఆ ముసురు ప్రళయంగా మారి యీ వూరు వాడ, యీ జగత్తుని ముంచేత్తేస్తే …..ఏ బాధ వుండదు. డబ్బు సంపాదించాలి – దినుసులు కొనాలి – వండాలి కడుపు నింపుకోవాలి , మానం కప్పుకోవాలి, పెళ్ళాడాలి, పిల్లల్ని కనాలి , వాళ్ళకి చదువు సంధ్యలు చెప్పించాలి. పెళ్ళిళ్ళు చెయ్యాలి, కట్నాలు పొయ్యాలి, అల్లుళ్ళని గౌరవించాలి , పురుళ్ళు పోయాలి, బారసాలలు చెయ్యాలి, ఏది వదలకుండా సంప్రదాయం ప్రకారం ముద్దు ముచ్చట్లు జరిపించాలి – వీటన్నింటికి డబ్బుండాలి ఆ డబ్బు లేకపోతే ఆ పాట్లు – యీ బాధలు ఏవి లేకుండా – తెల్లారకపోతే – యీ ముసురు తగ్గకపోతే – వరదలు వచ్చి యీ వూరు వాడ ముంచెత్తితే తనకే సమస్యలు మిగలవు. మంచం మీద ముసుగులోంచి బయటపడ కుండా ఆ ముసుగులోనే ఊపిరి ఆగిపోతే ఎంత బాగుండు ననిపించిందాయనకి.

          “యీ దిక్కుమాలిన సంసారం చెయ్యడం నావల్ల కాదు మహాప్రభో – పొయ్యిలోకి కర్రలు లేవు – పొయ్యి మీదకి గింజలు లేవు – కర్రలు లేవు, బొగ్గులయి పోయాయని మొన్నననగా చెప్పాను, తెల్లారేసరికి గొంతులో కాఫీలు దిగాలి – పంచదార నిండుకుంది. ఆ పాలదాని ధర్మమా అని మానకుండా ఏ నీళ్ళో ఆ నీళ్ళు పోస్తుంది. యీ పూటకి రెండు చెంచాలు కాఫీపొడి పిన్ని గారింటి నించి తెచ్చాను. బెల్లం ముక్క మరో యింట్లో ముష్టి – దిక్కుమాలిన ముష్టి బతుకు అయిపొయింది. యీ సంసారం ఎప్పటికి తెల్లారుతుందో , దిక్కుమాలిన తడి కర్రలు ఊదలేక ప్రాణం కడగడ్తుంది. వాగి వాగి చస్తుంది. అదే వూరు కుంటుంది అని నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటారు. అయ్యో – ఇల్లాలే – ఎంతపని కష్ట పెడ్తుంది. ఎంత కని అప్పులు తెస్తుంది. యీ సంసారం దాని దొక్కరిదేనా అన్న జ్ఞానం వున్న మనిషయితే అలా దిమ్మచెక్కలా కూర్చుంటారా – పెళ్ళాం బిడ్డల్ని పోషించలేని వాజమ్మలకి పెళ్ళేందుకు, పిల్లలెందుకు…. ఛీ….మనిషి జన్మ ఎత్తినందుకు పౌరుషం వుండాలి ….” యింతకీ నా ఖర్మ ఎవరిననీ ఏం లాభం …..’ తాయారమ్మ యీ స్త్రోత్రం మాధవయ్యకి సుప్రభాతంలా రోజూ వినిపించేదే కనక అయన చలించలేదు – కాఫీ వాసన తగలగానే కుక్కిమంచం లోంచి లేచి చూరు లోంచి పందుంపుల్ల లాగి నమలడం ఆరంభించాడు – అన్ని మాటాలంటున్నా చీమ కుట్టినట్లయినా లేకుండా సావకాశంగా పళ్ళు తోముకుంటున్న మొగుడ్ని చూసేసరికి తాయారమ్మ కి తిక్క రేగింది.

          “తిండికి తిమ్మరాజు – పనికి పోతురాజు – నాలుగు రాళ్ళు సంపాదించడం చాతకాదు కాని వేళవేళలకి కాఫీలకి, భోజనాలకి తయారు. పెళ్ళాం అప్పడాలు వత్తి , వడియాలు పట్టి, నీళ్ళ బిందెలు మోసి, పిళ్ళు విసిరి మేపుతుంటే తినడానికి సిగ్గేలా లేదో ……నరయ్ వాసు వెధవా లేరా. వసే కామాక్షి లేవవే. బారెడు పొద్దెక్కినా మంచం దిగవు ఆడదానివి కావుటే. నీ బుద్ది ఇలా తగలబడబట్టే ఆ కాపురం అలా తగలడింది. అయ్యకి తగ్గ కూతురివి. కన్నకూతురు కాపురం చక్కదిద్దాలన్న యావ తండ్రికి లేదు. అయ్యని నిలబెట్టి ఆ డబ్బు తెప్పించి కాపురంకి పోవాలన్న ఆరాటం కూతురికి లేదు – అంతా ఒక్కలాంటి సంతే – యీ పాడు సంసారం యీదడం నావల్ల కాదింక – నల్గురిలో తలెత్తుకోలేక చచ్చిపోతున్నాను. అమ్మాఎందుకు కాపురానికి వెళ్ళదు అని అందరూ అరా తీసేవారే – నా కూతురెందుకు కాపురానికి వెళ్ళలేదో వూర్లో వాళ్ళకి కావాలి. యీ అడిగే వెధవలందరూ తలో పది యిచ్చి సాయం చెయ్యరాదూ – హు నా నోరు నొప్పి గాని యీ యింట్లో ఎవరికీ చీమ కుట్టినటట్లుందా- రావే తల్లీ రా – మొహం కడుక్కుని కాఫీ సేవించు . పోయిన మొగుడు పొతే పోయాడన్నట్టు ….పీడా వదిలిందని యీవిడగారు ఉద్యోగం వెలగబెడ్తుందిట. కూతురిని కాపురానికి పంపే సత్తాలేని యీ తండ్రిగారి వత్తాసు దానికి. వరేయ్ వాసు గాడిదా లేవరా, దున్నపోతులా పడుకోడం కాదు – రెండు రోజులు ముసురు అంటూ స్కూలు ఎగ్గోట్టావు. పుస్తకాల దుమ్ము దులుపు…..ఆ తండ్రికి తగ్గ తనయుడివి – పొట్టకోసినా అక్షరం ముక్క లేదు …… అటు వేదం లేదు , యిటు చదువు లేదు, రామ రామ ఏనాడు ఏం పాపం చేసుకున్నానో యీ మొగుడు , పిల్లలు యింకేన్నాల్లో యీ పాడుబతుకు – ఆ దేముడు నన్నెందుకు తీసుకుపోడో ….”తండ్రి , పిల్లలు ఎవరూ ఆ మాటలు విననట్టే ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు – మాధవయ్య లో ఏనాడో చీము నెత్తురు హరించుకుపోయాయి. అన్ని తిట్టినా కోపం రాదాయనకి. పాపం తనని కట్టుకుని ఏం సుఖపడింది నిజానికి! నల్గురు ఆడపిల్లల్ని, యిద్దరు మగపిల్లల్ని ఈ లోకంలోకి తేవడం తప్ప తను ఏం చెయ్యగలిగాడు. ఏం సుఖ పెట్టాడు. పేద పురోహితుడింట్లో పుట్టి పేద పూజారిని కట్టుకుని పిల్లలు, రోగాలు, చాకిరి తప్ప ఏం సుఖపడింది – ఏదో జమీందారు గారు బతికున్నన్ని రోజులు తిండికి యిబ్బంది పడకుండా రోజులు గడిచి పోయాయి. ఆయనే వేణుగోపాలస్వామి మందిరం కట్టించి పూజారిని చేశాడు. దివాణం నించి ఏడాది గ్రాసం వచ్చేది. పండుగలు, పబ్బాలకి కొత్త బట్టలు పంపేవారు. పర్వదినా లకు పురాణ శ్రవణం చెప్పించి, ఘనంగా సత్కరించేవారు – దేవాలయంలో భక్తుల దక్షిణలుండేవి. రెండు గదుల కొంప కట్టించి రెండెకరాల పొలం రాసిచ్చి బీద బ్రాహ్మణుడి బాధ్యత తీర్చుకున్నాడు. ఆ మహారాజున్న రోజుల్లో భుక్తికి లోటు లేకుండా గడిచిపోయేది . అదిగో అయన పోయారు , జమీందారీలు పోయారు – జమీలు మంట గలిశాయి – వాళ్ళకే గతిలేదు. తమని ఆదుకునేదేవరు? ఆయనుండగా యిద్దరి కూతుళ్ళకి బాగానే పెళ్ళి చేశాడు- ఆ తర్వాతే కష్టాలు ప్రారంభం – మూడో కూతురికి ఎకరం పొలం అమ్మి చేశాకే దరిద్రం పట్టుకుంది. తిండి గింజలకే కరువొచ్చింది. కొడుకు రెక్కలు వచ్చి తన దారి తను వెతుక్కున్నాడు. తను తన సంసారం – వాడి పాట్లు వాడివి – తండ్రి గోల పట్టదు. పట్టించుకునే శక్తి లేదు. నాలుగో కూతురు ఎదిగి వచ్చింది. ఆదాయం లేదు – అప్పులు ఆరంభం అయ్యాయి. ఆఖరిదే అందరిలోకి చురుకైంది – ఆడపిల్లలకి నాలుగక్షరం ముక్కలు రావాలి. అనుకునే రోజులు వచ్చాయి. ఉచిత వేతనం , ఊర్లో స్కూలుంది. కనక మెట్రిక్ వరకు చదివించాడు. చూపులకి బాగుంటుంది. అంత మాత్రాన మొగుడు దొరుకుతాడా! ఇరవై మూడేళ్ళు దాటిపోతుంటే పెళ్ళాం పోరు భరించలేక ఆ కాసిని తిండి గింజ లోచ్చే ఎకరం అమ్మి ఇంటి మీద తాకట్టు తెచ్చి పెళ్ళి చెయ్యక తప్పలేదు. అప్పటినించే బొత్తిగా తిండికీ మొహం వాచే గతికి దిగజారారు. పోనీ పిల్లయినా సుఖ పడిందా అంటే అదీ లేదు ఇస్తామన్న కట్నానికి ఐదొందలు పెళ్ళి వేళకి జతపడక యివ్వలేదని, లాంచనాలు జరపలేదని, సారే తీసుకురాలేదని – మొగుడో త్రాష్టుడు , అత్త గయ్యాళి , మామ చవట అయి దాన్కి తిండన్నా పెట్టకుండా రాపాడిం చారు. డబ్బుతే అని వాతలు పెట్టి హింసిస్తే పారిపోయి పుట్టింటికి వచ్చింది కూతురు. వియ్యంకుడి కాళ్ళు పట్టుకున్నాడు. డబ్బు నెమ్మదిగా సర్దుతానన్నాడు. ససేమిరా డబ్బు లేకుండా గుమ్మం తొక్కద్దని తిట్టిపోశారు. ఆ రోజు నించి యీ ఏడాది – ఎంత ప్రయత్నిం చినా పట్టుమని పది రూపాయలు కూడ బెత్తలేకపోయాడు. తిండికి గతి లేకపోతే ఐదొంద లు కూడబెట్టడం ఎలాగ- ఇల్లు తాకట్టు విడిపించుకోలేదు. మళ్ళీ అప్పు ఇమ్మంటే ఇల్లు జప్తు చేసుకు డబ్బుస్తానన్నాడు షావుకారు. తల దాచుకోడానికి ఆ నీడన్నా లేకపోతే తమ గతి ఏమవుతుంది, తను అసమర్ధుడు, పెళ్ళాం తిట్టిందంటే తప్పు లేదు. చావలేని వెధవలకు – పెళ్ళాం పిల్లలకి తిండి పెట్టలేని బతుకు – అన్నారంటే అంటారు. యీ దరిద్రం నించి విముక్తి పొందాలంటే మరణం తప్ప అన్యదా శరణం నాస్తి …… కానీ …..కూతురు కాపురం చక్కపెట్టి — కొడుకు మెట్రిక్ అయ్యాక ఎవడి కాళ్ళో పట్టుకుని వాడికేదో తోవ చూపించాక తను తోవ చూసుకోవాలి. కన్నందుకు తన కనీస కర్తవ్యం అది – కూతురు కాపురం చక్కపడాలంటే డబ్బు కావాలి. ఐదొందలు కావాలి – ఎక్కడ నించి తేవాలి – ఎవరిస్తారు? అయన ప్రశ్న అది. అయన ఆరాటం అది, గత కొద్ది రోజులుగా అయన తీవ్రంగా అలోచించి అలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు — అందుకే యీ రోజు భార్య తిట్లు అంత బాధించలేదు.

* * *

          వేణుగోపాలస్వామి గుడిలో గంటలు మోగాయి . భక్తులు కొందరు హారతి కోసం నిల్చున్నారు.

          జమీందారు కాలంలో వేణుగోపాలస్వామి ఆలయం కళకళలాడేది- చీనీ చీనాంబరా లతో , నిలువెత్తు మాలలతో ధూపదీపాలతో రోజూ అర్చన జరిగేది. దద్దోజనం, చక్రపొంగలి , పులిహోర, రోజుకొకటి చొప్పున భోగం జరిగేది – పర్వదినాలలో ప్రత్యేక అలంకారాలు పురాణ పఠనం జరిగేది.

          జమీందారుగారితో పాటు వేణుగోపాలస్వామి వైభవం అంతరించింది. ఆలయం గోడలు బీటలు వేశాయి. బీటలలో పిచ్చి మొక్కలు మొలిచాయి. సున్నానికి నోచుకోక గోడలు నాచు పట్టాయి – నేల పెచ్చులు వూడింది. వేణుగోపాల స్వామి విగ్రహం వన్నె తగ్గింది. ఏనాటి చీని చీనాంబరాలో వెలసి వాలికలు పీలికలు అయ్యాయి. దీపస్థంబా లలో నూనె కూడా కరువయి ఒకే ఒక వత్తి వేసి దీపం వెలిగిస్తాడు మాధవయ్య — ఆ నాటి వైభవానికి గుర్తుగా ఆలయంలో వెండి హారతిపళ్ళెం , వెండి శఠగోపం మాత్రం నిలిచాయి. చుట్టూ నగిషీలు చెక్కిన రెండొందల తులాల హారతిపళ్ళెం ….ఆ హారతి పళ్ళెం …..ఆ హారతి పళ్ళెం పట్టుకున్న మాధవయ్య చెయ్యి వణుకుతుంది. ఈరోజు అసలు గుడి తలుపులు తెరిచి లోపలికి అడుగు పెట్తిం దగ్గరనించి మాధవయ్య కళ్ళల్లో వణుకు పుట్టింది. పూజ చేస్తూ మంత్రాలు చదువుతూ ఎన్నడూ లేంది తడబడి తప్పులు చదివాడు. చేతుల్లో బలం హరించిపోయినట్టు హారతి యిస్తూ గంట కొడుతుంటే చెయ్యి వణికింది. ప్రతి పనిలో ఆలశ్యం, హారతి కోసం బయట నిల్చున్న జనాన్ని చూసి అయన కంగారు మరింత ఎక్కువయి వంటి నిండా చెమటలు పట్టాయి – గుండె దడదడ లాడింది. “పంతులుగారూ, ఏమిటంత ఆలశ్యం ….’ ఎవరో కేకపెట్టారు. ‘వస్తున్నా’ అంటూ వణుకుతున్న చేతుల్తో హారతిపళ్ళెం , శఠగోపం , తీర్ధం తెచ్చి అందరికి హారతి యిచ్చి శఠగోపం పెట్టి తీర్ధం యిచ్చాడు మాధవయ్య – కళ తప్పిన అయన మొహం చూసి “ఏం బాబూ , ఆరోగ్యం సరిలేదా?” ఎవరో కుశల ప్రశ్న వేశారు. మాధవయ్య తడబడ్డాడు.

          “తమకు తెలియందేం వుంది బాబూ, సంసార బాధలు -” పేలవంగా నవ్వాడు అయన. అందరూ వెళ్ళాక హారతి పళ్ళెంలో పోగయిన అరవయి పైసలు రోంటిని దోపుకున్నాడు. గుడి తలుపులు మూయబోయే ముందు చటుక్కున పై మీద పంచా తీసి హారతి పళ్ళెం అందులో చుట్టబెట్టాడు. వేణుగోపాలస్వామి వైపు తిరిగి లెంపలు వేసుకుని “నా కింత కంటే దారి ఏది లేదన్నది నీకు తెలియనిది కాదు వేణు గోపాలా మన్నించు తండ్రీ” అంటూ గద్గద స్వరంతో ప్రణమిల్లి , చకచక తలుపు తాళం పెట్టి యింటివైపు వెళ్ళాడు.

          పెళ్ళాం, కూతురు చూడకుండా అలమరులో పాత పంచాంగాల కింద హారతి పళ్ళెం దాచాడు . ఉన్న ఊర్లో అమ్మితే గుళ్ళో హారతి పళ్ళెం అందరికీ గుర్తే. సాయంత్రం పక్క వూరికి తీసికెళ్ళి అమ్మాలి. తెల్లారి చీకట్నే గుడితలుపులు తీసి వుంచి ఏ దొంగో జొరపడి హారతి పళ్ళెం దొంగిలించాడని గొడవ చెయ్యాలి. అయన కంతకంటే గత్యంతరం లేదు. దేముడ్ని క్షమించమంటూ మనసులో లెంపలు వేసుకుని వెయ్యి దండాలు పెట్టుకున్నాడు. అయినా మనసులో పాప భీతి తగ్గలేదు. తిండి సయించ లేదు. “ఏం నాన్నా అలా వున్నారు వంట్లో బాగులేదా?” కూతురి సానుభూతిగా చూస్తూ అడిగింది. “ఏం లేదమ్మా తడబడ్డాడు మాధవయ్య.

          ‘అందరికీ రోగమే అడ్డెడు గిన్నేకేం రోగం లేదు” యీసడించింది తాయారమ్మ.

          “అమ్మా ఆ తినే రెండు ముద్దలన్నా తిననియ్యి ఆయన్ని కాస్త ప్రశాంతంగా .’ కూతురు తిరస్కారంగా తల్లిని చూస్తూ అంది.

          ‘అవునే తల్లీ నేనే గయ్యాళిని, రాక్షసిని, నానోరే కనిపిస్తుంది. తండ్రి కూతురోక్కటే – నేనో పైదాన్ని – అమ్మశక్తిని.”

          “అనవే అను – అను , నీ నోటికి అడ్డు అయిపు వుందా – నీ నోటికి తాళ’లేకా ……యీనాడు -యీ పనికి తగలడ్డా …….” ఆయనేం మాట్లాడుతున్నదీ అర్ధం కాగానే ఆవేశం చప్పున చల్లార్చుకుని చటుక్కున నోరు మూసుకుని అన్నం తినసాగాడు.

***

          చిన్న కునుకు తీసి, లేచి కాస్త పొద్దు వాలాక, వున్న ఒక చిరుగుల లాల్చీ తొడుక్కుని చేతి సంచిలో హారతి పళ్ళెం పెట్టడానికి అలమరు తీసి పాత పంచాంగాల కింద చెయ్యి పెట్టాడు మాధవయ్య అంతే — గుండె గుభీల్మంది — పళ్ళెం లేదు. ఆరాటంగా చకచక పుస్తకాలన్నీ వెతికి చూశాడు – లేదు. పెట్టిన పళ్ళెం , యింతకీ ఎలా మాయమైంది? ఈ లోగా ఏ దొంగ వచ్చాడు – ఎవర్ని అడగడం – చేసిన దొంగతనం బయటపడదూ? అడగ కుండా ఎలా వూరుకోటం? అయన గుండెల్లో దడ బయలుదేరింది. “కామాక్షి’ ఆయనకి తెలియకుండానే అరిచాడు- కామాక్షి రాలేదు – కాని తాయారమ్మ కయ్ మంది. “పాడు కొంప కాసేపు నడుం వాలుద్డామన్నా లేదు – ఎందుకలా రంకెలు పెడతారు, ఏం కావాలి?’ నిద్ర మధ్యలో విసుక్కుంది. “కామాక్షేది ?’ నెమ్మదిగా అడిగాడు. “ఏదో పత్రికలు తెచ్చుకోస్తానని జానకి దగ్గిర కెళ్ళింది.” మాధవయ్య నీరుగారి పోయాడు- కామాక్షి తీయలేదు – వాసు స్కూలుకి వెళ్ళాడు- పళ్ళెం ఎలామాయమయింది. ఆ భగవంతుడు తన మీద ఆగ్రహించి తను చేసిన వెధవ పనికి బుద్ది చెప్పడానికి మాయం చేశాడా? అనుమానం తోచి గబగబ దేవాలయం వైపు వెళ్ళాడు – గర్బగుడి తలుపు తీసి వుంది. అయన గుండె గుభేల్మంది. ఎదురుగా వుంది హారతి పళ్ళెం – తను పడ్డ కష్టం అంతా ఆ విధంగా వృధా అయిపోగానే ఏదో ఆవేశం, నిస్సహాయత, కసి, దుఖం, అవమానం ఆయన్ని ఊపేసింది. వ్రతం చెడ్డా ఫలం దక్కనందుకు ప్రాణం ఉసూరు మనిపించింది . మాయదారి దేముడు? ఎంత పనిచేశాడు? దేముడు లేడని ఎవరన్నారు? – ఉన్నాడు , ఎంచక్కా తన పళ్ళెం తను వెనక్కి తెచ్చుకున్నాడు- ఉక్రోషం వచ్చింది మాధవయ్యకి – కసిగా దేముడ్ని చూశాడు. ఏమయ్యా – వేణుగోపాలా – నలబై ఏళ్ళుగా నీ సేవ చేసు కుంటూ నిన్నే నమ్ముకుని బతుకుతున్నానే – ఒక్కనాడన్నా నా కష్టాలకి జాలిపడి నన్నాదుకున్నావూ — ఒక్కరోజు నేనున్నానని ముందుకు వచ్చి సహాయ పడ్డావూ ….యీనాడు కష్టాలలో ఉండి, తిండికి గతిలేక, కట్టుకున్న పెళ్ళాం గడ్డి పోచలా తీసి పారేస్తుంటే , కన్నకూతురు కాపురం నిలబెట్టడానికి గత్యంతరం లేక నీ హారతి పళ్ళెం అమ్ముకుందామనుకున్నాను. హు …..భగవంతుడివి గాబోలు, భక్తుల కష్టాలలో ఆదుకోవాల్సినవాడివి, అదుకోకపోగా…..నీ యింతోటి హారతి పళ్ళెం కోసం కక్కుర్తిపడి లాక్కుపోయావా, వెండి హారతిపళ్ళెం నీకేక్కువయిందా? ఎంత నిర్ధయుడివయ్యా దేముడూ — నా కన్నకూతురు కాపురం కంటే నీ వెండి పళ్ళెం నీకెక్కువా – హు ….నీ కూతురు గాదుగా , నీకెందుకు బాధ? నీవసలుంటే ….నీకు ఓ హృదయం వుంటే – యిలా చేస్తావా , నీవు నల్లరాయివయ్యా ….అంతే ఉత్త రాతి బొమ్మవి …..నిన్ను నమ్మి పూజించే వెర్రి వెధవలం మేము – నీవు పాషాణానివి — నీవే వుంటే రా – లేచివచ్చి ఆ పళ్ళెం యియ్యి- ఇన్నేళ్ళుగా కొల్చినందుకు నీ మహిమ చూపు లేదంటే …చూడు …ఏం చేస్తానో ….’ పిచ్చివాడిలా ఆవేశంగా అరిచాడు. అయన వళ్ళంతా చెమటలు పట్టాయి – మనిషి పూనకం వచ్చిన వాడిలాగ ఊగిపోయాడు. నీకోపానికి బెదరనులే …..ఫో…ఫో….పిచ్చివాడా అన్నట్టు వేణుగోపాలస్వామి కదలక మెదలక అలాగే చిరునవ్వులు చిందిస్తూ నిల్చు న్నాడు. అది చూసేసరికి మాధవయ్య ఆగ్రహం అవధులు దాటింది.

          “హ….నవ్వుతున్నావు గదూ …నా బీదరికం నా అగచాట్లు , నా నిస్సహాయత చూచి నవ్వుతున్నావు గదు. హ…నవ్వు…. అంతకంటే నీకేం చేతనవును. ఇదిగో ….నీ హారతి పళ్ళెం తీసి కేడుతున్నాను- నీ దిక్కున్న చోట చెప్పుకో…. రా….ఏం చేస్తావో చెయ్యి….” ఆవేశంగా హారతి పళ్ళెం తీయబోయాడు మాధవయ్య.

          “నాన్నా….’ చటుక్కున తలుపు చాటు నించి కామాక్షి వచ్చింది. మాధవయ్య ఉలిక్కిపడ్డాడు. కూతురిని చూసి , “నాన్నా దేముడు హారతిపళ్ళెం దేముడికే వుండనీ నాన్న…..మనకింక అవసరం లేదు….నాన్న. నాకీవూర్లో స్కూల్లో ఉద్యోగం యిచ్చారు. రెండొందలు జీతం నాన్నా! చూశావా నాన్నా దేముడు మనకి అపకారం చెయ్యలేదు. దేముడు మంచివాడు గనకే ఆ పళ్ళెం అమ్మి డబ్బిచ్చి నన్ను అత్తవారింటికి వెళ్ళి ఆ బాధలు పడకుండా చేశాడు. అంతా మనమంచికే చేస్తాడు చూశావా – నాన్నా నన్నింక ఆ నరకానికి వెళ్ళమనకు. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. నన్ను నేను కడతెర్చుకోడమే గాదు మిమ్మల్నీ కడతెర్చగలను- నన్నింక కొడుకనుకో – కామాక్షి గబగబఅంది. కూతురి మాటలు విస్తుపోతూ విన్నాడు మాధవయ్య.

          ‘అయితే హారతిపళ్ళెం తెచ్చి నీవా పెట్టేశావు యిక్కడ?” అయోమయంగా ఆడిగాడు.

          ‘అవును నాన్న- నీ వరస యివాళ నాకెందుకో అనుమానం అన్పించింది. ఇందాక అమ్మ దగ్గర అలా అన్నావు – వస్తున్నప్పుడు సంచిలో ఏదో తెచ్చి అలమరలో పెట్టావు . నాకనుమానం వచ్చి చూశాను – సరిగా అపుడే పోస్టులో నా ఉద్యోగం ఆర్డరు వచ్చింది. ‘ హారతి పళ్ళెం పవిత్ర కార్యానికి పనికొచ్చేది నాన్నా – దానితో నన్ను ఆ నీచుడింటికి కాపురానికి పంపడం ఆ దేముడికీ ఇష్టం లేదు నాన్న” కామాక్షి శాంతంగా అంది. మాధవయ్య ఇంకా అయోమయంగానే వేణుగోపాల స్వామి వంక  చూశాడు. ఎప్పటిలాగే చిరునవ్వులు చిందించాడు వేణుగోపాలస్వామి.

          “నన్ను తిట్టావు చూశావా అనవసరంగా” అన్నట్టనిపించింది ఆయనకి.

          “నీ లీలలు చిత్రమైనవి తండ్రి…..నన్ను క్షమించు వేణుగోపాలా….నీ ముందు మే మెంతవారం, నా అజ్ఞానాన్ని మన్నించు.” చేతులెత్తి నమస్కారం చేశాడు మాధవయ్య. అయన కన్నీటి పొరల మధ్య మసకమసకగా కన్పించాడు వేణుగోపాలస్వామి నవ్వుతూ.

(స్వాతి సౌజన్యంతో )

*****

( సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.